కిష్కింధా కాండ : వాలి వధ - 2
జూన్ 1963
వాలి వధ - 2
జరిగిన దానికి చింతిస్తూ రాముడు, ‘సుగ్రీవుడా! నా మీద ఆగ్రహించకు. మీరిద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. మీ కంఠ స్వరాలు కూడా ఒకటిగానే ఉన్నాయి. ఎవరు ఎవరో తెలియక నేను బాణం వెయ్య లేదు. నా అజ్ఞానం చేత నీకు అపాయం కలిగింది. మన్నించు. నీవు ఏదైనా గుర్తు ధరించి మళ్ళీ వాలితో యుద్ధం చేసినట్టయితే ఒక్క బాణంతో అతన్ని పడగొట్టుతాను, నా మాట నమ్ము,” అన్నాడు. కొండచరియపైన గజపుష్పి అనే లత పూలతో సహా పెరుగుతున్నది. లక్ష్మణుడు దాన్ని పెరికి తెచ్చి సుగ్రీవుడి మెడకు చుట్టాడు. అందరూ మరొకసారి కిష్కింధకు బయలుదేరి వెళ్ళారు. గజపుష్పి మెడకు చుట్టుకున్న సుగ్రీవుడి వెంట నళుడూ, నీలుడూ, తారుడూ కూడా ఉన్నారు. కిష్కింధకు వెళ్ళే దారిలో రాముడికి చెట్లతో దట్టంగా ఉన్న ఒక వనం కనిపించింది. రాముడు దాన్ని గురించి సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడు.
అది ఒక ఋష్యాశ్రమం. సప్త జనులనే పేరు గల ఏడుగురు ఋషులు ఆ ఆశ్రమంలో తీవ్రమైన తపస్సు చేశారు; నీటిలో తల కిందులుగా నిలబడి, వాయుభక్షణ చేస్తూ తపస్సు చేసి, శరీరాలతో స్వర్గానికి వెళ్ళి పోయారు. ఆ ఆశ్రమంలోకి మనుషులు కారు గదా, పశుపక్ష్యాదులు కూడా ప్రవేశించ లేవు; తెలియకలోపలికి వెళితే తిరిగి బయటికి రావటమంటూ ఉండదు. రామలక్ష్మణు లిద్దరూ సప్తజన మహర్షులను తలుచుకుని ఆ ఆశ్రమానికి సమస్కరించి ముందుకు పోయారు. చాలాదూరం వెళ్ళాక వారు కిష్కింధ చేరుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, “వాలిని చంపుతానని మాట ఇచ్చావు. ఆ పని శీఘ్రంగా చెయ్యాలి,” అన్నాడు. “ఈసారి వాలిని ఒక్క బాణంతో నిశ్చయంగా పడగొట్టుతాను. ఒకే రూపు గల మీ ఇద్దరిలో తారతమ్యం తెలియటానికి ఈసారి నీ మెడలో గజ పుష్పలత ఉన్నది కద. అందుచేత నీ కేమీ జంకు వద్దు. వాలిని యుద్ధానికి పిలు,” అని రాముడు చెప్పాడు. చుట్టూ ఉండే దట్టమైన అరణ్యంలో అందరూ దాగారు. సుగ్రీవుడు అరణ్యాన్ని ఒక్కసారి కలయజూసి భయంకరంగా గర్జించి వాలిని యుద్ధానికి పిలిచాడు.
ఈ గర్జన వింటూనే వాలికి పట్టరాని ఆగ్రహావేశం వచ్చేసింది. అతను యుద్ధానికి బయలుదేరాడు. ఇది చూసి తార చప్పున లేచి వాలిని పట్టుకుని, ఇలా అన్నది. “ఈ రాత్రివేళ నీవు వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చెయ్యవద్దు. కావలిస్తే రేపు ఉదయం వెళుదువుగాని. ఈలోపుగా నీ బలం తరిగి పోదు, సుగ్రీవుడి బలం హెచ్చి పోదు. ఇంతలో వచ్చిన తొందర ఏమిటి? కొంచెం ఆలోచించు! నేను అకారణంగా నిన్ను అడ్డగించటం లేదు. ఒకసారి నీ చేత చావు దెబ్బలు తిని దిక్కు తెలియకుండా పారిపోయిన సుగ్రీవుడు ఇప్పుడు ఏ ధైర్యంతో నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు? ఎవరి అండో చూసుకునే అతను నిన్ను కవ్విస్తున్నాడు. వారెవరో కూడా నాకు తెలుసు.అయోధ్య రాజైన దశరథుడి కొడుకులు రామ లక్ష్మణులు సుగ్రీవుడుండే ఋశ్యమూకానికి పచ్చి అతనితో సఖ్యం చేశారట. వారు ఇదివరకే విరాధుణ్ణి, ఖర దూషణులనూ, కబంధుణ్ణి చంపారట. చాలా పరాక్రమవంతులు. వారిని గురించి మన అంగదుడికి చారులు చెప్పారు. సుగ్రీవుడు చాలా గడుసువాడు. ఒకంతట ఇతరులను నమ్మడు. రాముడి అండ చూసుకునే అతను ఇప్పుడు వచ్చాడు; అందుకేమీ సందేహం లేదు. నీ మేలుకోరి ఇంకొక మాటకూడా చెబుతాను. ఇప్పుడు సుగ్రీవుడు నీ కన్న బలవంతుడని తెలుసుకో. అతన్ని పిలిచి యువరాజుగా అభిషేకించు. నీ తమ్ముడే కదా, కిష్కింధలోనే ఉండనీ నీకు రాముడి స్నేహం కూడా కలిసి వస్తుంది. సుగ్రీవుడితో యుద్ధ మంటే రాముడితో యుద్ధమే. రాముడితో యుద్ధం నీకు క్షేమకరం కాదు.”
తార చెప్పిన ఈ మాటలు వాలికి కొంచెంకూడా రుచించలేదు. అతను ఆమెతో, “తారా! నీవు నా మేలుకోరే ఈ మాట అన్నావు, కాని పిరికిదానివైన నీ మాటలు విని సుగ్రీవుడి ధూర్తత్వాన్ని సహిస్తానా? మహామహా వాళ్ళకే నేను భయపడలేదు, సుగ్రీవుడికి భయపడతానా? రాముడు నన్నెందుకు చంపుతాడు? అతనికి నేనేమీ ద్రోహం చెయ్యలేదు గద. సుగ్రీవుణ్ణి నేను చూస్తూ చూస్తూ చంపుతానా? శరీర మంతా నజ్జుగా కొట్టి బుద్ధి చెప్పి పంపేసి మళ్ళీ వస్తాను. నీవూ, మిగిలిన స్త్రీలూ నా వెంట పడి రాకండి; వెనక్కు వెళ్ళి పొండి,” అన్నాడు.
స్త్రీలు వెళ్ళిపోయారు. వారు భయపడతారని అంతదాకా తన ఆగ్రహాన్ని అణచుకుని ఉన్న వాలి భయంకరాకారం ధరించి, కిష్కింధా నగరద్వారం దాటి వచ్చి, నడుము బిగించి తనకోసం ఎదురు చూస్తున్న సుగ్రీవుణ్ణి చూశాడు. వెంటనే తానుకూడా నడుము బిగించి, “నీ ప్రాణాలు తీస్తాను,” అంటూ వాలి సుగ్రీవుణ్ణి తన పిడికిలితో కొట్టాడు. ఇద్దరూ చెట్లు పీకి, వాటితో ఒకరి నొకరు చావగొట్టుకున్నారు. వాలి అలిసి పోయాడు గాని సుగ్రీవుడు మరింత హెచ్చు. అలిశాడు భయంతో చూడసాగాడు. నలుదిక్కులు చూడసాగాడు. సుగ్రీవుడి క్షీణస్థితి గమనించి రాముడు కాల సర్పంలాటి బాణాన్ని ఏరి, ఎక్కుపెట్టి చెవిదాకా లాగి, వాలి ఎదురు రొమ్ముకు గురి చేసి విడిచాడు. వాలి దాని దెబ్బకు కింద పడిపోయాడు. అనేక సువర్ణాభరణాలూ, ఇంద్రుడిచ్చిన కాంచనమాలికా ధరించి నేలపై పడి ఉన్న వాలి వద్దకు రామలక్ష్మణులు వెళ్ళారు. వాలి మెల్లిగా కళ్ళు తెరిచి రామలక్ష్మణులను చూసి రాముడితో,
“నీవు మహారాజు కొడుకువు గొప్ప వంశంలో పుట్టిన వాడవు. ధర్మాచరణ చేసే వాడివి, నేను మరొకరితో యుద్ధం చేస్తూండగా నన్ను బాణం వేసి కొట్టటం నీకేమంత ఖ్యాతికరం? తార నన్నుయుద్ధానికి వెళ్ళ వద్దని చెబితే నీ వంశాన్నీ, గుణాలనూ నమ్మి, నన్నేమీ చేయవనుకుని వచ్చాను. నేను నీ దేశానికి రాలేదు. నీకేమీ అపకారం చెయ్యలేదు. నిన్ను యుద్ధానికి పిలవలేదు. వానర మాత్రుణ్ణి, అందులోనూ మరొకరితో పోరుతున్నవాణ్ణి. నన్ను నీ వెందుకు హత్య చేస్తున్నావు? నీవు దుర్బుద్ధివి. విల్లు పట్టుకు తిరిగే హంతకుడివి. నీకు ధర్మమన్నది లేదు. నన్ను జంతువు లాగా వేటాడావనుకుందామన్నా నా చర్మం ధరించటానికి పనికిరాదు. నా రోమాలూ, ఎముకలూ ఉపయోగపడవు. నా మాంసం తినటానికి పనికిరాదు. నీవు నిజంగా పరాక్రమం కలవాడవయితే రావణుడు మొదలైన వారిని చంపరాదా? నా ఎదటికి వచ్చి యుద్ధం చేస్తే ఈపాటికి యముడి వద్ద ఉండేవాడవు. సీతను వెతకమని నన్నే కోరి ఉంటే ఒక్క రోజులో నీ భార్యను తెచ్చి నీకిచ్చి ఉందును. అందుకేగదా నీవు సుగ్రీవుడికి ఉపకారం చెయ్యబోయి నన్ను చంపావు?” అన్నాడు.
వాలి చేసిన ఈ ఆక్షేపణకు రాముడీ విధంగా జవాబు చెప్పాడు "నీకు ధర్మార్థ కామాలకు సంబంధించిన ఆచారాలు తెలియవు. సమస్త భూమండలానికి ఇక్ష్వాకులు రాజులు. భూమండలంలో అధర్మాన్ని శిక్షించే బాధ్యత ఇక్ష్వాకు రాజులది. ప్రస్తుతం భూమి కంతకూ భరతుడు రాజు. నా బోటి క్షత్రియులం అతని ఆజ్ఞకు బద్దులమై అధర్మాన్ని శిక్షిస్తున్నాము. వానరుడవు కావటంచేతనూ, వానరుల సాంగత్యం కలిగి ఉండటం చేతనూ నీకు ధర్మసూక్ష్మాలు తెలియవు. నీవు నీ తమ్ముడి భార్యను పరిగ్రహించావు. ఇది మహాపాపం. అందుకు మరణమే శిక్ష. నిన్ను శిక్షించక వదిలితే నేను ధర్మం తప్పిన వాణ్ణవుతాను.
అదీ గాక నేను సుగ్రీవుడితో చేసిన మైత్రి లక్ష్మణుడికి నాకూ గల బాంధవ్యంలాటిది. నేను భార్య నిమిత్తమూ, అతను రాజ్యం నిమిత్తమూ ఈ సఖ్యం చేసుకున్నాము. నిన్ను చంపుతానని వానరుల ముందు నేను ప్రతిజ్ఞ చేశాను. నేను చేసిన ప్రతిజ్ఞ తప్పటానికి వీలులేదు. అందుచేత నిన్ను వధించటంలో నేను అధర్మం అణుమాత్రం కూడా చెయ్యలేదు. నీవు కొన్ని మానవ ధర్మాలు ఆచరించటం చేతపై విధంగా చెప్పాను. కోతివిగా చూస్తే నిన్ను నేను ఏ సమయంలోనైనా వేటాడవచ్చు. అభక్ష్య మృగాలను కూడా వేటాడుతారు. అవి ఏ మరుపాటున ఉన్నవా, పారిపోతున్నవా, నిర్భయంగా ఉన్నవా అని చూడరు. కోతివైన నిన్ను నేను నాతో యుద్ధం చేస్తేనే చంపాలన్న నియమం ఎక్కడా లేదు.”
రాముడు చెప్పినదంతా విని వాలి తాను రాముణ్ణి నిందించి నందుకు పశ్చాత్తాప పడ్డాడు. అతను రాముడితో, “నాకు చచ్చి పోతున్నానని దిగులు లేదు. నీ చేతిలో చావాలనే తార వద్దన్నా వినకుండా సుగ్రీవుడితో ద్వంద్వ యుద్ధానికి వచ్చాను. నాకు అంగదుడు ఒక్కడే కొడుకు. వాణ్ణి గురించే నాకు దిగులు. వాణ్ణి సుగ్రీవుడు సరిగా చూసేలాగు చూడు. సుగ్రీవుడికి నా భార్య అయిన తారపై కక్ష ఉండవచ్చు. అతను ఆమెను అవమానించకుండా చూడు,” అన్నాడు. అతనికి స్పృహ తప్పింది. రాముడి బాణంతో వాలి దెబ్బ తిన్న వార్త తారకు తెలిసింది. ఆమె దుర్భరమైన దుఃఖంతో తన కొడుకుతో సహా కిష్కింధ నుంచి వచ్చింది.
రాముడి చేత దెబ్బ తిన్న వాలిని చూసి భయపడి కొందరు వాలి అనుచరులు పారిపోయి వస్తూ, తారకు ఎదురయారు. వారు తారతో, “అమ్మా, నీ కొడుకింకా బతికి ఉన్నాడు. వాణ్ణి కాపాడుకోవటానికి తిరిగి వెళ్ళిపో. మృత్యువు రాముడి రూపంలో వచ్చి వాలిని తీసుకు పోతున్నది. అంగదుడికి పట్టాభిషేకం చెయ్యాలి. కిష్కింధ ద్వారం మూసి జాగ్రత్తగా రక్షించాలి. అలా చేయని పక్షంలో నీవు కిష్కింధను శత్రువులకు విడిచి పారిపో,”అన్నారు. “అంతటి భర్తే పోతుంటే ఇక నాకీ రాజ్యమూ, ఈ కొడుకూ, ఈ శరీరమూ పట్టుతాయా? నేను నా భర్త పాదల దగ్గిరికే పోతాను,” అని వలవలా ఏడుస్తూ తార వాలి పడి ఉన్న చోటికి వెళ్ళింది. ఆమె రామలక్ష్మణులనూ, సుగ్రీవుణ్ణి దాటి వెళ్ళి వాలిని చేరుకుని, అతనికి స్పృహ లేకపోవటం చూసి ప్రాణం పోయిందనుకుని మూర్ఛపోయింది. తరువాత స్పృహ నుంచి తేరుకుని భర్తను కౌగలించుకుని పెద్ద పెట్టున ఏడవసాగింది.
వాలి సమీపంలోనే నిలబడి ఉన్న హనుమంతుడు తారను ఓదార్చ యత్నించాడు. అంతలో వాలి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సుగ్రీవుణ్ణి చూసి, "సుగ్రీవా! మనం అన్నదమ్ములుగా సఖ్యం కలిగి, రాజ్య భోగాలనుకలిసి అనుభవించటానికి నోచుకోలేదు. అందుచేతనే నిన్ను వెళ్ళగొట్టాను. నీ భార్యను అపహరించానని నాపై కోపం ఉంచుకోకు. నా కొడుకు అంగదుణ్ణి నీకు అప్పగిస్తున్నాను. వాణ్ణి నేను చూసినట్టుగానే చూడు, నేను లేనిలోటు రానియ్యకు. ఇక వానరరాజ్యం నీవే ఏలుకో. నా ప్రాణాలు పోయేలోపుగా ఈ కాంచనమాలికను తీసుకో.” అన్నాడు.
తరువాత అతను అంగదుడితో, “నాయనా! ఇక నుంచీ నీవు మీ పినతండ్రి చెప్పినట్టు నడుచుకో. అతని శత్రువులతోగాని, వారి మిత్రులతోగాని చేరకు. నన్ను ఎలా చూసుకున్నావో. అలాగే ఇక ముందు సుగ్రీవుణ్ణి కూడా చూసుకో,” అని చెప్పి ప్రాణాలు వదిలాడు. వానరు లందరూ ఒక్కసారి గొల్లున ఏడిచారు. తార తన భర్త కళేబరాన్ని కౌగలించుకుని మూర్ఛపోయింది. తరువాత నీలుడు వాలి రొమ్మున నాటుకున్న రామ బాణాన్ని లాగేశాడు. అంగదుడు తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు.
సుగ్రీవుడు కళ్ళ నీరు కార్చుతూ రాముణ్ణి సమీపించి, “రామా! నీవు అన్న ప్రకారం. వాలిని వధించావుగాని నాకు భోగాల మీదా, జీవితం మీదా కూడా విరక్తి కలిగింది. తారా, కిష్కింధలోని వానరులూ, అంగదుడు ఈ దుఃఖ సముద్రంలో ముణిగి ఉండగా నాకు రాజ్యమేమిటి? వాలి నన్ను పెట్టిన కష్టాలు తలుచుకున్న కోపంతో అతని చావు కోరాను. ఇప్పుడు పశ్చాత్తాపం నన్ను దహించేస్తున్నది. వాలి దొడ్డబుద్ధిగలవాడు, నన్ను చంపటానికి ఎన్నడూ యత్నించలేదు. అతణ్ణి చంపాలన్న కోరిక మహాపాపినైన నాకే కలిగింది. నేనుకూడా వాలితోపాటు దహనమైపోతాను. వానరులు నీ కోసం సీతను అన్వేషిస్తారు,” అన్నాడు.