వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

కిష్కింధా కాండ : సుగ్రీవుని పట్టాభిషేకము

జూలై 1963


సుగ్రీవుని పట్టాభిషేకము

 రాముడు దుఃఖంతో మూర్ఛపోయి ఉన్న తారను చూశాడు. అది గమనించి వానరులు తారను వాలి శరీరం మీది నుంచి పట్టి లేవదీశారు. తార రాముణ్ణి చూసి అతన్ని సమీపించి, “రామా! నా భర్త ప్రాణాలు తీసిన బాణంతోనే నన్ను కూడా చంపి, నా భర్త వద్దకు చేర్చు, సీత కోసం నీవు ఎలా తపిస్తున్నావో, వాలి నా కోసం ఆలోకంలో అలా తపిస్తాడు. భార్యా వియోగం ఏమిటో నీకు తెలుసు గదా ! వాలి పోయాక నేను జీవచ్ఛవాన్నే గనక స్త్రీ హత్యాదోషం నిన్నంటదు” అంటూ ఏడ్చింది. రాముడు తారనూ, సుగ్రీవుణ్ణి యథోచితంగా ఊరడించాడు. వాలి దహన క్రియల పని చూడమని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి హెచ్చరించాడు.

 తారుడు కిష్కింధకు వెళ్ళి వాలిని మొయ్యటానికి ఒక పల్లకీ తెచ్చాడు. సుగ్రీవుడూ, అంగదుడూ వాలిని ఎత్తి పల్లకీలో పడుకో బెట్టారు. బలిష్ఠులైన వానరులు పల్లకి మోస్తూ వెళ్ళారు. వెనక కిష్కింధా నగర స్త్రీలు ఏడుస్తూ వెళ్ళారు. ఒక వాగు ఒడ్డున ఇసుక ప్రదేశంలో వాలికి చితి ఏర్పాటయింది. అంగదుడు శాస్త్రోక్తంగా చితికి నిప్పు పెట్టాడు. తరువాత వానరులు వాలికి జలతర్పణాలు విడిచారు. ఉత్తరక్రియలు పూర్తి కాగానే సుగ్రీవుడు తడిబట్టలతో, తన మంత్రులను వెంట బెట్టుకుని రాముడి వద్దకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రాముడితో, “మీ అనుగ్రహం చేత సుగ్రీవుడు వానర రాజ్యాన్ని పొందగలిగాడు. అతనిక రాజ్య భారం వహించవలిసి ఉన్నది. అందుచేత మీరు వచ్చి అతనికి సక్రమంగా పట్టాభి షేకం చేయించండి,” అన్నాడు. దానికి రాముడు, “హనుమంతుడా! తండ్రి ఆనతి ప్రకారం నేను పద్నాలుగేళ్ళ పాటు గ్రామాలలోకీ, నగరాలలోకి అడుగు పెట్ట వీలులేదు. అందుచేత మీరంతా సుగ్రీవుణ్ణి కిష్కింధకు తీసుకుపోయి శాస్త్ర ప్రకారం పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి,” అన్నాడు.

 రాముడు సుగ్రీవుడితో అంగదుణ్ణి యువరాజును చెయ్యమని, వర్షాకాలం ఆరంభం కాబోతున్నది గనుక వానలు పోయేదాకా తానూ, లక్ష్మణుడూ ఋశ్యమూకం మీది గుహలో ఉంటామనీ, కార్తికమాసం ఆరంభమయేటప్పుడు సుగ్రీవుడు రావణుడిపై యుద్ధ యత్నాలు ఆరంభించవలిసి ఉంటుందనీ చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి యధావిధిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కిష్కింధ వాసులందరు సంతోషించారు. గజుడూ, గవాక్షుడూ, గవయుడూ, శరభుడూ, గంధమాదనుడూ, హనుమంతుడూ, జాంబవంతుడూ, నళుడూ బంగారు కలశాలతో సుగ్రీవుణ్ణు అభిషేకించారు. తన పట్టాభిషేకం పూర్తి కాగానే సుగ్రీవుడు అంగదుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేసి, అంగదుడిపై ఆదరాభిమానాలు గల కిష్కింధ పౌరులకు ఆనందం కలిగించాడు. తరువాత అతను రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, కిష్కింధకు తిరిగి వచ్చి తన భార్య అయిన రుమతో సుఖంగా కాలం గడపసాగాడు.

 రాము లక్ష్మణులు తమ నివాసాన్ని ప్రస్రణ పర్వతంపైన ఉండే ఒక విశాలమైన గుహకు మార్చుకున్నారు. ఈ గుహ అన్ని విధాలా సౌకర్యంగా ఉన్నది. గుహాలోకి వానజల్లు రాదు, ఈదురుగాలి రాదు. పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. సమీపంలోనే నది ఉన్నది. అదీకాక ఈ గుహ కిష్కింధకు చాలా దగ్గర కిష్కింధలోని గీత వాద్య ధ్వనులూ, వానరుల కేకలూ ఆ గుహకు వినిపిస్తున్నాయి.

 ఇలాటి గుహలో రాముడు అహెూరాత్రాలు సీతకై విరహం పొందుతూ, లక్ష్మణుడి చేత హెచ్చరించబడుతూ, సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యకపోతాడా అని ఆశ్చర్యపడుతూ, ఈ నాలుగు మాసాలూ గడిచి శరత్కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు. వానాకాలం వచ్చింది, వెళ్ళింది. సుగ్రీవుడు తన భార్య అయిన రుమతో భోగాలలో ముణిగి తేలుతూ, రాజ్యభారం మంత్రులపై వేసి, రామకార్యం నిర్వర్తించే సమయం వచ్చిందన్న మాటకూడా తలపెట్టలేదు. అందుచేత హనుమంతుడు సుగ్రీవుడి వద్దకు వచ్చి, “నీకు రాజ్యమూ, కీర్తి లభించాయి. శత్రుభయం ఏమీలేదు. కాని మన మిత్రుల పని చూడవలిసిన బాధ్యత అలాగే ఉండిపోయింది. ఇలాటి పనులలో జాప్యం కూడా తప్పే.

 అందుచేత వెంటనే సీతను వెతికే పని ప్రారంభించు. నీ సహాయం కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పటికీ, భార్యా వియోగంతో ఎంతగా తపించి పోతున్నప్పటికీ రాముడు నీ బాధ్యతను జ్ఞాపకం చెయ్యటం లేదు. అతను అడగక ముందే మనం పని ప్రారంభిస్తే మనకు అలక్ష్యదోషం ఉండదు. నీ మాట నీవు నిలబెట్టుకుంటావనే ఉద్దేశంతో అతను ఎదురు చూస్తున్నాడు. ఇంక ఆలస్యం చెయ్యటం భావ్యం కాదు,” అన్నాడు. ఈ హెచ్చరికతో సుగ్రీవుడు చైతన్యం పొందాడు. అతను నీలుణ్ణి పిలిచి సైన్యాలన్నిటినీ రప్పించమని ఆజ్ఞాపించాడు; ఏ వానరుడు గాని పదిహేను రోజులలోపుగా కిష్కింధకు చేరకపోతే వాడికి మరణ దండన విధించమన్నాడు; జాంబవంతాదుల దగ్గరికి అంగదుణ్ణి వెంట బెట్టుకుని నీలుణ్ణి స్వయంగా వెళ్ళమన్నాడు.

 ఒకనాడు లక్ష్మణుడు ఫలాల కోసం కొండ కోనలన్నీ చెడతిరిగి వచ్చేసరికి రాముడు అగాధమైన దుఃఖంలో ముణిగి ఉన్నాడు. అతనికి శరత్కాలంతోబాటు సీతా వియోగ బాధ కలిగి దుఃఖం ముంచుకొచ్చింది. లక్ష్మణుడు తన అలవాటు ప్రకారం రాముణ్ణి ఊరడించి, దుఃఖం నిరుపయోగ మనీ, కర్తవ్యం నెరవేర్చటానికి ధైర్యమూ, ఉపాయమూ కావాలనీ జ్ఞాపకం చేశాడు.

 అంతా విని రాముడు, “లక్ష్మణా! వానాకాలం వెళ్ళి శరత్కాలం వచ్చింది. ఈ నాలుగు నెలలూ ఎంతో బాధతో గడిపాను. రాజులు యుద్ధాలకు బయలుదేరే సమయం వచ్చినా సుగ్రీవుడి జాడలేదు. అతను ఏ ప్రయత్నంలోనూ ఉన్నట్టు కనపడడు. అతనికి నా మీద ఇంకా దయ రాలేదు. ‘రాముడు దిక్కులేనివాడు, రాజ్యభ్రష్టుడు, అడవుల పాలై, భార్యను రావణు డపహరించగా దైన్యంతో మన శరణు జొచ్చాడు,’ అని సుగ్రీవుడు నన్ను అనాదరంగా చూస్తున్నట్టున్నాడు. లేక తన పని గడిచింది గదా అని తాను చేసిన వాగ్దానాన్ని మరిచాడో ! నీవు కిష్కింధకు వెళ్ళి నేను చెప్పినట్టుగా అతనితో చెప్పు, అన్న మాట నిలబెట్టుకొని వాడు పురుషాథముడు. ప్రత్యుపకారం చెయ్యని వాడి శవాన్ని కాకులూ గద్దలూ కూడా ముట్టవు. అతనికి నా బాణం యొక్క ధ్వని మళ్ళీ వినాలని ఉన్నదేమో! ఇందుకేనా ఈ సుగ్రీవుడితో నేను స్నేహం చేసి, వాలిని చంపింది? వాలిని ఒక్కణ్ణి చంపాను, ఈ సుగ్రీవుణ్ణి బంధువులతో సహా చంపగలను. అందుచేత నీవు సుగ్రీవుడితో ఎలా చెప్పాలో అలా చెప్పు,” అన్నాడు.