కిష్కింధా కాండ : సంపాతి లంకజాడ చెప్పుట
అక్టోబర్ 1963
సంపాతి లంకజాడ చెప్పుట
సంపాతి తన తమ్ముడి మరణ వార్త విని కన్నీరు కార్చుతూ, “జటాయువును చంపిన ఆ దుర్మార్గుడు రావణుడిపైన పగ తీర్చుకుందామన్నా నేను ముసలివాణ్ణి, రెక్కలు లేనివాణ్ణి, ఏం చేసేది? వెనక వృత్రాసురుడి వథ జరిగిన రోజుల్లో నేనూ, జటాయువూ పోటీ పడి ఒకరి కన్న ఒకరం వేగంగా ఎగురుతూ ఆకాశంలోకి వెళ్ళాం. మిట్ట మధ్యాహ్నపు ఎండ తీవ్రతకు తట్టుకోలేక జటాయువు వివశుడై సోలి పోయాడు. అప్పుడు నేను ప్రేమ కొద్దీ నా రెక్కలు చాచి వాడికి నీడ ఇచ్చాను. దానితో నా రెక్కలు మాడి పోయాయి; నేను ఈ వింధ్య పర్వతంపైన పడ్డాను. తరువాత నాకు నా తమ్ముడి సమాచారమే తెలియలేదు,” అన్నాడు. ఈ మాట విని అంగదుడు, “అయ్యా, నీవు జటాయువు అన్నవైతే ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో, ఎంత దూరాన ఉంటాడో చెప్పు,” అన్నాడు.
“నాయనా! న్యాయానికి నేను స్వయంగా రామకార్యం చెయ్యవలసిన వాణ్ణిగాని, ముసలివాణ్ణి, అశక్తుణ్ణి కావటంచేత వాక్సహాయమైనా చేస్తాను. రావణుడు సీతను తీసుకునిపోయిన మాట నిజమే. అతను లంకలో ఉంటాడు. అది ఇక్కడికి నూరామడల దూరాన సముద్ర మధ్యలో ఉన్నది. లంకలోనే లంకా నగరం ఉన్నది. దాన్ని విశ్వకర్మ బంగారు ద్వారాలతో, బంగారు అరుగులతో, గొప్ప ప్రాకారాలతో నిర్మించాడు. ఆ లంకలోని రావణుడి అంతఃపురంలో సీత రాక్షస స్త్రీల మధ్య దుఃఖిస్తూ ఉన్నది. గద్ద జాతివాణ్ణి కావటం చేత ఇక్కడి నుండే రావణుణ్ణి, సీతనూ చూడగలుగుతున్నాను. మీరక్కడికి వెంటనే వెళ్ళి నట్టయితే సీత తప్పక కనబడుతుంది,” అన్నాడు సంపాతి.
అప్పుడు జాంబవంతుడు సంపాతితో, ‘అయ్యా, సీతను రావణుడు పట్టుకుపోగా చూసింది ఎవరు?” అని అడిగాడు. మిగిలిన వానరులు సంపాతి చెప్పే మాటలను ఆసక్తితో వినటానికి ఎదురు చూశారు. సుపార్శ్వుడు రోజూ నియమం తప్పకుండా. నాకు ఆహారం తెచ్చి ఇస్తూ ఉంటాడు. అలాటిది వాడు ఒకనాడు వేళమించి, సూర్యాస్తమయం అయినాక రావటమేగాక వట్టి చేతులతో వచ్చాడు. అసలే ఆకలి దహించుకుపోతూ ఉండటంచేత నేను వాణ్ణి బాగా తిట్టాను. నా కోపం పోగొట్టుతూ వాడు జరిగిన సంగతి చెప్పాడు. వాడు నా ఆహారం నిమిత్తం మహేంద్ర పర్వతం వద్ద జంతువులు నడిచే దారికి అడ్డంగా నిలిచి ఉన్నాడట. ఆ సమయంలో నల్లని శరీరం గల వాడొకడు సూర్యోదయం లాగా వెలిగిపోయే ఒక స్త్రీని తీసుకుపోతూ అటుగా వచ్చాడట.
ఆ మగవాణ్ణి, ఆడదాన్ని నాకు ఆహారంగా తీసుకు వద్దామని సుపార్శ్వుడు ఆలోచిస్తుండగా ఆ నల్లటివాడు చాలా మంచితనంగా దారి విడవమని కోరాడట. మర్యాదగా అడిగాడుగదా అని నా కొడుకు దారి ఇచ్చాడట. ఈ సంగతి తెలిసి అక్కడి మునులు సుపార్శ్వుడితో, "ఇవాళ నీవు బతికిబయటపడటం నీ అదృష్టం! నిన్ను దారి అడిగినవాడు మరెవరో కాదు, లంకానగరాన్ని ఏలే రావణుడు. వాడు ఎత్తుకు పోతున్నది రాముడి భార్య అయిన సీత !’ అని అన్నారట. ఇదంతా జరగటం మూలాన వాడు నాకు వేళకు ఆహారంతీసుకు రాలేకపోయానని చెప్పాడు.”అన్నాడు సంపాతి. తరువాత సంపాతి తన తమ్ముడికి ఇన్ని నీళ్ళు విడిచి, స్నానం చేసి ఒక చోట కూర్చున్నాడు. వానరులు అతని చుట్టూ చేరి కూచున్నారు. సంపాతి మళ్ళీ వారితో ఇలా అన్నాడు.
“నేను సూర్యుడి వేడికి రెక్కలు కాలి ఇక్కడ పడిపోయానని చెప్పాను కాదూ? ఆరు రోజులపాటు నాకు స్పృహలేదు. ఆ తరువాత, నేను పడినది వింధ్య పర్వతం మీద అని తెలుసుకున్నాను. అప్పుడిక్కడ నిశాకర మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన గొప్ప తపస్వి. అదివరకు నేనూ, మా జటాయువూ ఆ మహర్షిని ఎరుగుదుము. నేను మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ ఆయన ఆశ్రమానికి వచ్చి ఆయన దర్శనం కోసం ఒక చెట్టు కింద నిలిచాను. కొంత సేపటికి మహర్షి స్నానం చేసి అటుగా వచ్చాడు. ఆయన తిన్నగా ఆశ్రమంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి నన్ను చూసి నేను వచ్చిన పని అడిగాడు. నా దుస్థితికి కారణం ఏమిటన్నాడు. నన్ను గుర్తించాడు కూడా. నే నాయనతో జరిగినదంతా చెప్పాను.”
“నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని కూడా ఆయనతో అన్నాను. నాకు దుఃఖం ఆగలేదు. ఆయన కొంతసేపు కళ్ళు మూసి ధ్యాన నిమగ్నుడై, "నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి, జవసత్వా లేర్పడతాయి. భవిష్యత్తులో దశరథుడనే రాజు పుట్టబోతాడు. అతని కొడుకు భార్యతో అరణ్యవాసం చేయవస్తాడు. వారు జనస్థానంలో ఉండేటప్పుడు రావణుడనే రాక్షసరాజు రాముడి భార్యను అపహరిస్తాడు. ఆమె కోసం వెతకమని రాముడు పంపగా వానరులు నీ వుండే చోటికి వస్తారు. వారికి నీవు సీత సంగతి చెప్పు. నీవు ఎక్కడికీ పోలేవు గనక ఇక్కడే ఉండటం మంచిది." అన్నాడు.
“ఇదంతా ఎనిమిది వేల ఏళ్ళనాటి మాట. నాకీ సంగతి చెప్పిన నిశాకరమహర్షి నూరేళ్ళ అనంతరం దేహం చాలించాడు. నా మనసు అయోమయంలో పడిపోయింది. రావణుడు బలశాలి అయితేనేంగాక, ఆ దుర్మార్గుడు సీతను తీసుకుపోవటం నా కొడుకు కళ్ళారా! చూశాడని తెలిసినప్పుడు, వాడితో పోరి సీతను విడిపించి ఉండవలిసింది అని నా కొడుకును మందలించాను. నా తమ్ముడు ప్రాణాలు విడిచాడు, నా కొడుకు ఏమీ చేయనేలేదు. రావణుడు మహాపరాక్రమ వంతుడనటానికి సందేహం లేదు. కాని మీరు తక్కువవాళ్ళు కారు. సుగ్రీవుడు సరి అయిన వాళ్ళనే ఎంచి పంపాడు. మీరు వెళ్ళినట్టయితే సీత తప్పక కనిపిస్తుంది. తరువాత రామ లక్ష్మణుల బాణాలతో ఆ రావణుడు తప్పక చస్తాడు. వాడు నా తమ్ముడైన జటాయువును చంపినందుకు నా పగకూడా తీరుతుంది.”
ఈ విధంగా సంపాతి వానరులతో చెబుతూండగానే అతనికి కొత్త రెక్కలూ, ఈకలూ మొలుచుకు వచ్చాయి. సంపాతి ఆనందంతో, “చూశారా, నిశాకరమహర్షి చెప్పినది అక్షరాలా జరిగింది. మీరు వెళ్ళే పని జరుగుతుందని కూడా ఆయన అన్నాడు. అందుచేత మీకు కార్యసిద్ధి తప్పక అవుతుంది,” అంటూ ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసి వానరులు కూడా కొత్త ఉత్సా హంతో దక్షిణంగా బయలుదేరారు. సీత జాడ తెలిసిన సంతోషంతో వాళ్ళు గెంతారు, సింహనాదాలు చేశారు. ఈ విధంగా వెళ్ళి. వారు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు.
వానరులు కొత్త ఉత్సాహంతో దక్షిణంగా బయలుదేరారు. సీత జాడ తెలిసిన సంతోషంతో వాళ్ళు గెంతారు, సింహనాదాలు చేశారు. ఈ విధంగా వెళ్ళి. వారు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అంతులేని ఆ సముద్రాన్ని చూడగానే వానరులకు భయం పుట్టింది. ఆ సముద్రంలో నూరామడల దూరాన లంక ఉన్నది. దీన్ని ఎలా దాటటం? అంగదుడు మేటి వానరులను సమావేశపరిచి, “మనం ఎలాగైనా ఈ సముద్రాన్ని దాటనిదే సీతాదేవిని చూడలేము. సీతను చూడకుండా తిరిగిపోయే కన్న ఇక్కడ ప్రాయోపవేశం చెయ్యటం మేలు. సముద్రాన్ని చూసి భయపడి ప్రయోజనం లేదు. మీలో ఎవరెవరు ఎంతెంత దూరం దూకగలరో చెప్పండి,” అన్నాడు.
సముద్రం దాటి లంకకు చేరగల ఘటికుడిపైన అందరి క్షేమమూ ఆధారపడి ఉన్నది. గజుడు పది ఆమడల దూరం దూకగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గవయుడు ముప్ఫై ఆమడలూ దూకగల నన్నాడు. నలభై ఆమడలు దూకగల నన్నాడు శరభుడు, గంధమాదనుడూ, మైందుడూ, ద్వివిదుడూ వరసగా యాభై, అరవై, డెబ్భై ఆమడలు దూకగల మన్నారు. సుషేణుడు ఎనభై ఆమడలు దూకగల నన్నాడు. జాంబవంతుడు, “ఒకప్పుడు నేను ఎంత దూరమైనా దూకేవాణ్ణి. త్రివిక్రముడు వామనావతార మెత్తి మూడడుగులతో మూడులోకాలూ ఆక్రమించి నప్పుడు నేను అతని చుట్టూ ప్రదక్షిణం తిరిగి వచ్చాను. ఇప్పుడు ముసలివాణ్ణి, తొంభై యోజనాలు మించి దూకలేను,” అన్నాడు.
అందరన్న మాటలూ విని అంగదుడు, “నేను నూరు ఆమడల దూరం సులువు గానే దూకగలను. కాని తిరిగి రాగలనని నిశ్చయంగా చెప్పలేను,” అన్నాడు. ఆ మాట విని జాంబవంతుడు, ‘నాయనా! మాకు రాజువంటి వాడవు. నీవు మాలో ఒక్కణ్ణి లంకకు పంపవచ్చు. గాని నిన్ను మేమెలా పంపుతాము? అది పొసగదు,” అన్నాడు. “నేనూ వెళ్ళక, మీలో వెళ్ళేవారూ లేకపోతే ఇక మనకు ప్రాయోపవేశమేగదా గతి?” అన్నాడు అంగదుడు. “నాయనా! ఆ విషయం నీ వేమీ విచారించకు. మన పని సానుకూలం చెయ్య గల మహామహుడు అడుగో దూరాన ఒంటరిగా కూచున్నాడు,” అంటూ జాంబవంతుడు హనుమంతుణ్ణి చూపాడు.
అతను హనుమంతుడి వద్దకు వెళ్ళి, “మేమంతా తలలు పగల గొట్టుకుంటూ ఉంటే మా కందరికీ మేటివైన నీవు ఉలుకూ పలుకూ లేకుండా ఇక్కడ ఒంటిగా కూర్చున్నావేమిటి? పుట్టుతూనే సూర్యుణ్ణి చూసి పండనుకుని ఆకాశాని కెగిరిన వాడవుకదా, నీవు కాక ఈ మహాసముద్రాన్ని మరెవరు దాటగలరు? వేగంలో వాయువుకు సమానమైన వాడవు, గరుత్మంతుడికి తీసిపోనివాడవు. ఎగరటంలో నీకు సరివచ్చేవాళ్ళు మాలో ఎవరున్నారు? నీ ప్రజ్ఞ చూడటానికి ఈ వానరులంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరి లే లేచి నీ శక్తి చూపించు!” అని ఉత్సాహపరిచాడు. ఈ మాటలు వింటూంటే హనుమంతుడి శరీరం పొంగిపోయింది. హనుమంతుడి శరీరం పెరిగిపోతున్న కొద్దీ వానరులు ఉత్సాహాతిశయంతో సింహనాదాలు చేశారు.
వారి ప్రశంసలు వింటున్న కొద్దీ హనుమంతుడి బలం కూడా పెరగ సాగింది. ఆ ఉత్సాహంలో అతను, “ఔను, ఈ సముద్రాన్ని అవలీలగా దాటుతాను. కావలిస్తే నేను సూర్యుడితో బాటు తూర్పు నుంచి బయలుదేరి పడమరకు వెళ్ళి మధ్యాహ్నాని కల్లా సూర్యుడికి ఎదురు రాగలను. శుభశకునాలు కలుగుతున్నాయి. నేను సీతాదేవిని తప్పక చూసి వస్తాను. మీరేమి దిగులు పడకండి,” అన్నాడు. తాను భూమిని తన్నిపైకి లేచేటప్పుడు భూమి కంపిస్తుందనే ఉద్దేశంతో హనుమంతుడు సమీపంలో ఉన్న మహేంద్ర పర్వత శిఖరాన్ని ఎక్కాడు. అతను అక్కడ నడుస్తుంటే అతని పాద ఘట్టనకు రాళ్ళు పిండి అయాయి, మహేంద్రగిరిపై ఉండే జంతువులు భయపడి నలు దిక్కులకు పారిపోయాయి.