వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : కైకేయి వరములు

డిసెంబర్ 1961
కైకేయి వరములు

“రాముణ్ణి అడవులకు పంపి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను. విని నేను చెప్పినట్టు నడుచుకో. ఒకప్పుడు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు. ఆయన వెంట నీవూ వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్వజుడేలే వైజయంతం వద్ద శంబరుడనే మహాబలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్ధం చేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడు ఆయనను నీవు యుద్దరంగం నుంచి దూరంగా తీసుకుపోయి ఆయన ప్రాణాలు కాపాడావు స్పృహ తెలిసినాక నీ సేవకు సంతోషించి నీకు రెండు వారాలు ఇచ్చాడు. కానీ వాటిని తర్వాత నీవు కోరుకుంటానన్నావు. చూశావా? ఇప్పుడు రెండు వరాలు కోరుకునే సమయం వచ్చింది. రాముణ్ణి పధ్నాలుగేళ్ళు అడవులకు పంపమని భరతుడికి పట్టాభిషేకం చేయమని నీవు ఇప్పుడు నీ భర్తను కోరు” అని మందర కైకేయికి హితవు చెప్పింది.

 కైకేయి పాపం సహజంగా మంచి స్వభావం కలదే గానీ మందర చేసిన బోధలతో ఆమె మనస్సు పెడదారి పడింది. ఆ మందర తన తలలో ఒక చెడ్డ భావం ప్రవేశపెట్టడంతో పాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది. కైకేయి మందరను “ఓసి గూనిదానా నిజంగా నీవెంత తెలివిగల దానవే నా మేలు నీవు కోరినట్టుగా మరెవరు కోరరు గదా” అని ప్రశంసించింది “ఆ శంబారాసురుడి కన్న నీకెక్కువ తంత్రాలు తెలుసుగదే” అని కైకేయి మందరను మెచ్చుకుంది. తన భర్త తనకు వరాలివ్వని పక్షంలో చచ్చిపోవడానికి కూడా ఆమె నిశ్చయించుకుంది. ఆమె ముసలిదాని సలహాతో తన నగలన్నీ తీసివేసి చిరిగిన కోక ఒకటి చుట్టుకుని కోపగృహానికి వెళ్ళి కటిక నేల మీద అలిగిన దానిలాగా పడుకుంది.

“నీభర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికి మంటికి ఏకధారిగా ఏడు నీ కోపంగాని నీ శోకంగాని రాజు కొంచమైనా భరించలేడు. వాటిని పోగొట్టడానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన రెండు వరాలు ఇచ్చిన దాకా నీవు మెత్తబడకు. నీకు మణులు ముత్యాలు బంగారం ఇస్తానంటాడు అక్కర్లేదని బెట్టు చెయ్యి. ఆలోచించుకో భరతుడు పధ్నాలుగేళ్ళు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరు కదిలించలేరు.” అన్నది మంధర. దశరథుడు రామ పట్టాభిషేక యత్నాలకాజ్ఞ ఇచ్చి ఈ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో, కైకేయి శయన గృహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవడం చూసి ఆశ్చర్యపడి, “కైకేయి ఎక్కడ ఉన్నావు” అని పిలిచాడు. జవాబు లేదు. ఆయన అంతపురం ద్వారం దగ్గరికి వచ్చి అక్కడి ద్వారపాలికను “కైకేయీ ఎక్కడ” అని అడిగాడు. ద్వారపాలిక భయంతో చేతులు జోడించి “ప్రభూ వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పింది.”

 దశరథుడు కలవర పడుతూ కోపగృహానికి వెళ్ళి అక్కడ నేలపైపడి ఉన్న కైకేయిని చూశాడు. లక్షల వరహాల విలువ చేసే ముత్యాల హారాలు, ఇతర ఆభరణాలు నేలపై చెల్లా చెదరుగా పడి ఉండి, ఆకాశంలో నక్షత్రాల లాగా మెరుస్తున్నాయి. దశరథుడు కైకేయిని సమీపించి ఎంతోప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ “దేవి! నీకెందుకు ఇలా కోపం వచ్చింది ఎవరి మీద, ఎవరన్నా నిన్ను తిట్టారా అవమానించారా ఒంట్లో సరిగా లేదా, వైద్యులను పిలిపించినా, ఎందుకు ఏడుస్తావు ఊరుకో కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్లను దండిస్తాను నిర్దోషులైనా సరే. నీకోసం ఏ దరిద్రుడిని అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతో పాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి నీ కోరిక ఏమిటో చెప్పు నా ప్రాణాలు ఒడ్డి అయినా సరే ఆ కోరిక తీరుస్తాను. లే కైకేయి! లే” అన్నాడు.

 ఈ మాటలు విని కైకేయి “నాకు ఎవరు అపకారం చేయలేదు, అవమానము చేయలేదు. నాకొక కోరిక ఉన్నది, దానిని మీరు తీరుస్తారని ప్రమాణం చేసేటట్లయితే చెబుతాను అన్నది” దశరథుడు ఆమాటలకు చిరునవ్వు నవ్వి కైకేయి జుట్టు చేతితో నిమురుతూ తన ప్రాణంతో సమానమై రాముడిపైన ఒట్టుపెట్టుకొని ఆమె కోరిక తీర్చడానికి ప్రమాణం చేశాడు. అప్పుడు కైకేయి దశరథుడికి శంబరాసురుడితో జరిగిన యుద్ధాన్నీ ముర్చితుడై ఉన్న సమయంలో ఆయనను రక్షించి దూరంగా తీసుకెళ్లి పరిచర్యలు చేసిన విషయాన్నీ, ఆ సమయంలో ఆయన రెండు వరాలు ఇస్తాను కోరమంటే తాను కోరమంటే తాను తరువాత కోరుకుంటానన్న సంగతి జ్ఞాపకం చేసింది. తర్వాత ఆ వరాలు రెండు బయట పెట్టింది. రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చేయాలి, రాముడు నారబట్టలను కృష్ణాజినాన్నీ జడలను ముని వేషాన్ని ధరించి పధ్నాలుగేళ్ళు దండకారణ్యంలో నివసించాలి.

ఆ మాటలు వింటుంటే దశరథుడికేదో భయంపుట్టుకొచ్చింది స్పృహ తప్పినట్టు అయింది. కాళ్లు చేతులు వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ ఆయన కైకేయిని నానా తిట్లు తిట్టాడు. “నీవు రాజ కుమార్తెవి అనుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ నీవు విషము కక్కే పామువు. నిన్ను తల్లిగా చూసుకుంటాడు కదా, ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్టావు నేను నీకేం ద్రోహం చేశాను ఏ మహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపాలి. నా ప్రాణాలైనా వదలగలను కానీ రాముణ్ణి చూడకుండా బతకలేనే. ఈ దిక్కుమాలిన ఆలోచన మానుకో నీ కాళ్లు నెత్తిన పెట్టుకుంటాను, నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చేయడానికి ఇలా ఉంటావు. రాముడు చేసిన సేవలో ఎన్నో వంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు. నీకు రాముడి కంటే భరతుడెక్కువ అంటే నేను నమ్మాను. నీ మాటలతో నన్ను చాలా బాధ పెట్టావు చూడు నేను ముసలివాడిని కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. కావలిస్తే భూమండల మంతా తీసుకోకాని రాముడిపై ఆగ్రహించకు నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను.” అని కైకేయిని దశరథుడు ఎంతోసేపు వేడుకున్నాడు.

 దశరథుడు ఇలా దిగజారిపోతున్న కొద్ది కైకేయి ఆగ్రహం రెచ్చిపోయింది. మొదటి వరాలు ఇస్తానని ఇప్పుడు కోరిక తీరుస్తానని ప్రమాణాలు చేసి దశరథుడు బేలగా మాట్లాడడం రాజకులానికే కళంకమని ఆమె అన్నది. తన వరాలను ఉపసంహరించుకో నని, రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చచ్చిపోతానని అన్నది. దశరథుడు మానసిక వేదనతో దహించుకుపోయాడు. ఎటువంటి విషమ పరిస్థితి. “నాయనా అడవికి పోరా!” అని రాముడితో ఎలా చెప్పడం? కైకేయి కోరిక ప్రకారం రామ పట్టాభిషేకం మానేస్తే, ఇతర రాజులంతా "పట్టాభిషేకం చాలా బాగా చేశారే" అని యద్దేవా చేయరూ? కౌసల్య ముఖం ఎలా చూడడం? అని ఆయన తనలో తాను దుఃఖించాడు. మధ్యమధ్య మూర్చపోయాడు ఆ రాత్రి ఆయనకు కాలరాత్రి లాగా గడిచి తెల్లవారింది.

 వశిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరకు వచ్చి దశరథుడి అంతఃపురం వాకిలి దగ్గర సుమంత్రుడెదురు కాగా తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని రాజుగారు కదిలి రావటమే వ్యవధి అని వశిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్ఛగా అంతఃపురంలోకి ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్ధుడు కావటం చేత రాజుగారికి బాల్యమిత్రుడు గనక ఆయనను ఎవరూ అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్లి రాజుగారి పరిస్థితి ఊహించక ఆయన నిద్రపోతున్నాడనుకుని “మహారాజా! లేవండి. సూర్యోదయం కూడా అయింది. రామ పట్టాభిషేకం జరిపించడానికి అందరూ తమ రాక కోసం చాలా సేపు ఉన్నారు” అని చెప్పాడు.

 దశరథుడు శోకంతో వాచి ఎఱ్ఱగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చూసి “ఏమోయ్? నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖ పెడతావు?” అన్నాడు. దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చేతులు జోడించి రెండడుగులు వెనక్కి వేశాడు. దశరథుడు సుమంత్రుడితో మాట్లాడే స్థితిలోలేనందున కైకేయి “సుమంత్రుడా! మహారాజుకు రామ పట్టాభిషేకమన్న ఆనందంతో నిద్రలేదు ఇప్పుడే కాస్త కునుకు పట్టింది.” నీవు వెళ్లి రాముణ్ణి పిలుచుకురా ఇదే రాజు గారి ఆజ్ఞ అనుకొని అన్నది.

“రాముడు ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు కాబోలు” అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు నగరమంతా ఉత్సవంలాగా కోలాహలంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది సంబరాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రాజులందరూ కానుకలు తెచ్చారు వారు తమలో తాము రాజుగారు కనిపించ లేదు, మనం వచ్చిన సంగతి వారికెలా తెలియడం అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, “తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి చెప్పాను వారి దగ్గరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను” అని చెప్పాడు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి దశరథుడి అంతఃపురానికి దశరథుడు పడుకొని ఉన్న చోటికి చేరి “దశరథమహారాజా! విజయిభవ రాత్రి గడిచి, తెల్లవారి, సూర్యోదయం కూడా అయింది. మీకోసం బ్రాహ్మణులు సేనాపతులు పట్టణంలోని పెద్దలు ఉన్నారు, నిద్ర మేలుకొని జరగవలసిన కర్మకాండ జరిపించండి” అన్నాడు.

“రాముణ్ణి తీసుకురమ్మని కైకేయి నీతో చెప్తే, తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా? నేను నిద్రపోవడం లేదు, మేలుకొనే ఉన్నాను వేగిరం రాముణ్ణి తీసుకురా” అన్నాడు దశరథుడు. సుమంత్రుడు చిత్తమని చెప్పి రాజుకు నమస్కారం చేసి ఏదో గొప్పగా ఏర్పాటు జరగబోతున్నది. అని తనలోతాను సంతోష పడుతూ రాజవీధి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడుండే నగరానికి రథం తోలుకొని వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరారు.రాముడి అంతపురం చుట్టూ ఏనుగులు, గుఱ్ఱాలు,సైనికులు, మంత్రులు కిటకిటలాడుతున్నారు. సుమంత్రుడు వారి అందరిని తోసుకుంటూ వెళ్లి రాముడుండే ఏడంతస్తుల మేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టు రాముడికి కబురు పంపి అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్ళాడు.

 రాముడు చక్కగా అలంకరించుకొని బంగారు చెక్కీపై నిలబడి ఉన్నాడు. సీతపక్కనే నిలబడి వింజామర వీస్తున్నది. సుమంత్రుడు అతనిని సమీపించి నమస్కరించి "తండ్రి గారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు. నిన్ను చూడాలంటున్నారు." అని చెప్పాడు ఈ మాటలు విని రాముడు ఆనందంతో పొంగిపోయాడు. అతను సీతను లోపలికి పంపి పట్టాభిషేకానికి చేసిన అలంకారాలన్నీటితోను సుమంత్రుడివెంట బయలుదేరాడు. అతను పులితోలు పరిచిన రథం ఎక్కి కూర్చోగానే లక్ష్మణుడు కూడా వెనకగా ఎక్కి ఒక చేత్తో అన్నగారికి చత్రంపట్టి రెండవ చేత్తో చామరం వీచాడు. వెనుకగా గుఱ్ఱాలు ఏనుగులు ఎక్కిన రౌతులూ కోలాహలంగా వేలకొద్దీ జనం నడిచారు.

 రథం దశరథుడి నగరము ప్రవేశించి మూడు ప్రాకారాలు దాటి నిలిచిపోయింది. తన వెంట వచ్చిన బలగము ప్రజలు అక్కడ నిలిచిపోగా, రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక అందమైన ఆసనంపైన దశరథుడూ కైకేయి కూర్చుని ఉన్నారు. రాముడు తండ్రికాళ్ళకు తరువాత కైకేయి కాళ్లకు నమస్కరించాడు. “రామా” అంటూ ఏదో చెప్పబోయి దశరథుడు గొంతు పెగలక కళ్ళు మూతపడి కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివశుడయ్యాడు.